

పార్వతీపురంలో పుట్టిన ఋణాన్ని తీర్చుకునేందుకన్నట్లు ఎ.ఎన్.జగన్నాథ శర్మగారు తన కథల సంపుటి 'పేగుకాలిన వాసన' పరిచయ సభను ఈ సాయంత్రం యిక్కడ నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షులుగా ప్రముఖ కవి కె.శివారెడ్డి నిర్వహణలో సభ ఆధ్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. కథల సంపుటిని కథల మాస్టారు శ్రీ కాళీపట్నం రామారావు గారు ఆవిష్కరించారు. కథలను ఉత్తరాంధ్ర కథకులు అట్టాడ అప్పల్నాయుడు ముందుగా పరిచయం చేస్తూ కథలలో శర్మ గారు జీవన విషాదాన్ని ప్రముఖంగా రాసారంటూ అగ్రహారం బ్రాహ్మణుల జీవితాలలోని విధ్వంసాన్ని కూడా రాయాల్సిన అవసరముంది. ఈ కథలలో శర్మగారు చాలా వరకు తన నేపథ్య జీవితాన్ని ఆవిష్కరించారన్నారు. ఆ తరువాత సీమకథకులు ఆచార్య మధురాంతకం నరేంద్ర కథలను విపులంగా పరిచయం చేస్తూ యుద్ధం, విప్లవం, నినాదాలు లేకుండా విప్లవ కథలు చదవాలంటే శర్మ గారి కథలే చదవాలి. మార్క్సిస్టు దృక్పధంతో రాసినా కథలలో చదివినంతసేపూ విధ్వంసం చదువరికి బోధపడుతుంది గానీ అది విప్లవ కథగా వెంటనే స్ఫురించకుండానే ఆలోచనలను చైతన్యవంతం చేయడంలో ఈ కథలు తమ పాత్రను పోషిస్తాయని చెప్పారు. నినాదాలు లేకుండా గొప్ప మార్క్సిస్టు కథలు రాసిన వారు శర్మగారని కొనియాడారు. నాన్నంటే కథ గొప్ప విప్లవకథగా పరిచయం చేసారు. గొప్ప కళాకారుడిగా కీర్తించారు. రెండు రెళ్ళు గురించి చెప్పి చివరిగా నాలుగు రావడాన్ని గోప్యంగా వుంచి అది పాఠకుడికి విడిచిపెట్టడంలో శర్మ సఫలీకృతులయ్యారనన్నారు. గుడిపాటి తనకు శర్మ గారితో వున్న పరిచయాన్ని చెప్తూనే కథాసంకలనాలను కొని సాహిత్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను తెలియజేసారు. చివరిగా శర్మ గారు తనకు పార్వతీపురంతో వున్న పరిచయాన్ని చెప్తూనే తనకు కథా రచన తన అమ్మనుండే అబ్బిందని, స్క్రీన్ ప్లే ఎలా రాయాలో తాను తన తల్లి దగ్గరే నేర్చుకున్నానని చెప్పారు. చివరిగా తన బాల్య మిత్రులు, సహాధ్యాయులు శర్మగారిని సన్మానించారు.
No comments:
Post a Comment
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..