Monday, January 31, 2011

నిశ్శబ్ధం చీడ కావద్దు








ఇక్కడేదో వాన ముందర

మబ్బులు కమ్మి

మసక బారినట్లు వుంది

తుఫాను ముందర

సంద్రం ప్రశాంతంగా అగుపిస్తున్నట్లుంది


మౌనాన్ని అంగీకారంగా

ఓటమికి చిహ్నంగా మారుద్దామన్న

తాపత్రయంతో వాళ్ళు ముంచుకొస్తున్నారు


కానీ

వేసిన వెనకడుగు

మరిన్ని బారల దూరాన్ని

అధిగమించడానికేనన్న

ఎరుకతో వుండండి..


నిశ్శబ్ధం బద్దలై

వసంత మేఘం గర్జించి

వర్షించే సమయుం

ఆసన్నమైంది...


ఇన్నాళ్ళు పొగిలి పొగిలి

ఏడ్చిన కనులే

నేడు విస్ఫులింగాల్ని

కురిపించనున్నాయి...

మోసపోయి పోయి

దగాపడ్డ జనమంతా

దండై నేడు

కదులుతున్న క్షణాన

ఢిల్లీ పీఠం కదలబారుతున్నది


ఎగరనీ ఎగరనీ

స్వతంత్ర తెలంగాణా

ఝెండా

నయా వలస పాలకుల

గుండెలపై...

Saturday, January 29, 2011

గోరఖ్ పాండే స్మృతిలో




















యువ కవీ

నీ గురించి తెలుసుకున్న క్షణం

నీ పోరాట రూపాన్ని తలుచుకున్న క్షణం

ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాను

విద్యాధికుడివైనా
శ్రామిక జన పక్షపాతిగా కలం పట్టి
కుళ్ళు రాజకీయ వ్యవస్థపై

అక్షర పోరాట బాణాలనెక్కుపెట్టి

జన సాంస్కృతిక మంచ్
స్థాపించి
హిందీ, భోజ్ పురిలలో
సాహిత్య సృజన చేసి
నిరంతరం జన విముక్తిని
కలలు గన్న
ఓ కవీ
రవీ విప్లవ కవీ
నీ కలలు నేటికీ సజీవం

నీ జ్ఞాపకాలు వెంటాడుతూనే వున్నాయి..


( ఈ రోజు గోరఖ్ పాండే ఆత్మహత్య చేసుకున్న రోజు. ఆయన తాను ఏర్పాటుచేసిన జన సాంస్కృతి మంచ్ తాను రూపొందిచిన ఆశయాలకనుగుణంగా ఎదగకపోవడం, సభ్యుల మధ్య సత్సంబంధాలు దూరం కావడంతో జనవరి 29,1989 న ఆత్మహత్య చేసుకున్నారు. పిన్నవయసులోనే మరణించిన ఈ కవి రెండు కవితా సంపుటాలు ప్రచురించారు. అలాగే వ్యవసాయ కూలీ పోరాటాలకు మద్ధతుగా పనిచేస్తూ రచనలు చేసారు. ఆయన జే.ఎన్.యు విద్యార్థి.A scholar of Sanskrit as well as a research scholar in philosophy, he did not let his academic background hamper his activity among the people.హిందీ కవితా రచనలలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికిన గోరఖ్ పాండేకు జోహార్లర్పిద్దాం)

Friday, January 21, 2011

తడి












ఇప్పుడేదో అంతా
ఎడారి పరుచుకున్నట్లు
పాదాలు ఎర్రని ఎండలో
కూరుకుపోతున్నట్లు
అరచేతులలో తడి
ఆరినతనం..

దేనిని తాకినా
ఏదో రబ్బరు తొడుగు
దేహమంతా
కప్పబడినట్లు
స్పర్శ కోల్పోయినతనం..


కనుల లోయలో
పరచుకున్న
ఎండమావులు....
గాజు కళ్ళుగా
మారిపోయాయన్నట్టు
ఏదీ ఇంకనితనం..


అంతా రంగు రుచి లేని
కషాయంలా గొంతులో
ఏదో విషం దిగుతున్నా
బాధ తెలియని
శిలాజంలా...


ఒంటరితనంవైపు
మొగ్గుతూ బాహ్యాంతరాలలో
ఏదో నిషేధ ఘోష


చుట్టూరా కమ్ముకున్న
ఈ సమ్మె వాతావరణంలో
నాలుక పిడచకట్టి
గొంతెండిన వేసవితనం
వెంటాడుతోంది...


ఎక్కడో దాగిన కాసింత
కన్నీటి ఊట
నన్నింకా ఇలా
మనిషిలా(?)
నీముందు...

(ఈ కవిత ముందుగా 'పొద్దు' లో వచ్చింది)

Saturday, January 8, 2011

కళింగాంధ్ర గోస

ఇక్కడ గలగల పారే జీవనదులు

నాగావళి, వంశధారలతో పాటు

జంఝావతి, వేగావతి, గోస్తనీ,

చంపావతి, మహేంద్ర తనయ...

ఇంకా ఎన్నో ఎన్నెన్నో నదులు,

సెలయేళ్ళు, వాగులు, వంకలు

ఊటలు, పిట్టల కిలకిలా రావాలు,

పచ్చాపచ్చని అడవులు, సక్కని సుక్కలమల్లె పల్లెలు

సిన్నసిన్న పట్టణాలు, ఇసాకపట్నం నగరం,

ఇవన్నీ జూసి కన్నుకుట్టీ

బొగ్గు నిప్పుల కుంపట్లన్నీ

మా గుండెలపై రాజేస్తావా?

మా నెత్తిపై అణు బాంబునెత్తి

మా నేల పచ్చదనాన్ని భగ్గున మండిస్తావా?

మా సేపల వలలెత్తుకెల్లి

మరపడవలతో మా సంద్రం కడుపులో

దేవుకు పోతావా?

మా నట్టింట్లో కొచ్చి బంగరు

గనులన్నీ కాజేస్సి

మా కొండఫలాల్ని ఎత్తుకుపోయి

మా బూములన్నీ బుగ్గిజేసి

మా నీళ్ళన్నీ ఇసంజేసి

మా దీపాల్ని ఆర్పేయజూస్తావా?

మా బతుకులు సెడగొట్టడానికొస్తే

నీ పీక కోసి తలకాయ మా బొబ్బిలి

కోట గుమ్మానికి ఏలాడదీస్తాం!

Friday, January 7, 2011

డా.జ్నానానంద కవి మృతి

పద్మశ్రీ, కళాప్రపూర్ణ, డా.సురగాలి తిమోతి జ్నానానంద కవి నిన్న కాకినాడలో అనారోగ్యంతో తన 90వ ఏట మరణించారు. ఈయన విజయనగరం జిల్లా, బొబ్బిలి సమీపంలోని పెదపెంకి గ్రామంలో 1922, జూలై 16 న జన్మించారు. కాకినాడలోని మెక్లారిన్ హైస్కూల్ లో 35 సం.లపాటు తెలుగు పండితునిగా పనిచేసారు. 30 కి పైగా రచనలు చేసారు. బుద్ధుని శిష్యురాలైన ఆమ్రపాలి పై రాసిన కావ్యం పేరొందింది. అలాగే గోల్కొండ కావ్యం, క్రీస్తు చరిత్ర, తరంగమాల, వసంతగానం, గాంధీ, దేశబంధు, పాంచజన్యం, ప్రభంజనం, పర్జాన్యం, వెలుగుపాట, విజయాభిషేకం కావ్యాలు సాహితీ లోకాన్ని అలరింపచేసాయి. ఈ కావ్యాలలో చాలావరకు పాఠ్యాంశాలుగా చేర్చబడి ప్రశంశలందుకొన్నాయి. ఈ సాహితీపురుషుని నిష్క్రమణ తెలుగు సాహితీరంగాన్ని దుఃఖసాగరంలో ముంచింది..

Wednesday, January 5, 2011

నాన్నగారు

















నాకు
ఆయనను చూసినప్పుడంతా

మేరు పర్వతం వర్ణనే గుర్తొస్తుంది

ఆ నీడలో వుంటే దేన్నైనా
జయించగలనన్న
హామీ గుండెనిండా..

చల్లగా ఆ చేతి స్పర్శ నుదుటిపై తాకగానే

చందమామ పుస్తకంలోని
రాకుమారునిలా మారి
రెక్కలగుఱమెక్కి
వినువీధిలో
షికారుకెల్లిన అనుభూతి...


తను కన్నెఱ చేస్తే పాదాల కింద
నేల
ఈనెలై అగాథాలలో పడిపోతున్న బావన...


తన పాదముద్రలను తాకగానే

కడిగిన ముత్యమల్లే మనసంతా
తేలికై
ఒక్కసారిగా దేహమంతా
కొత్త వెలుగు...

నాన్నగారూ
మీ కివే
నా జన్మదిన
శుభాభినందనలు...
Related Posts Plugin for WordPress, Blogger...