Friday, April 30, 2010

నూరేళ్ళ శ్రీశ్రీ కి నీరాజనాలు




తన జీవితకాలమంతా అభాగ్యుల వెతలను
కవితా తూటాలుగా పేల్చి
ఆచరణలో ఉద్యమాల వెంట నిలిచి
పతితులు, బాధాసర్పద్రష్టులకు
నేనున్నానని,
రేపు మనదేనని
కష్టజీవికి యిరువైపులా నిలబడ్డవాడే కవి అని
తెలుగు బావుటా రెపరెపలను
దశదిశలా వ్యాపింపచేయ
శరపరంపరగా అక్షరయాగం చేసిన
మహాకవికి అరుణారుణ వందనాలు..
నూరేళ్ళ శ్రీశ్రీ కి నీరాజనాలు..


http://www.mahakavisrisri.com/home/VideoClips.htm

Sunday, April 25, 2010

'పేగుకాలిన వాసన' జగన్నాధ శర్మగారి కథలపరిచయ సభ





పార్వతీపురంలో పుట్టిన ఋణాన్ని తీర్చుకునేందుకన్నట్లు ఎ.ఎన్.జగన్నాథ శర్మగారు తన కథల సంపుటి 'పేగుకాలిన వాసన' పరిచయ సభను ఈ సాయంత్రం యిక్కడ నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షులుగా ప్రముఖ కవి కె.శివారెడ్డి నిర్వహణలో సభ ఆధ్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. కథల సంపుటిని కథల మాస్టారు శ్రీ కాళీపట్నం రామారావు గారు ఆవిష్కరించారు. కథలను ఉత్తరాంధ్ర కథకులు అట్టాడ అప్పల్నాయుడు ముందుగా పరిచయం చేస్తూ కథలలో శర్మ గారు జీవన విషాదాన్ని ప్రముఖంగా రాసారంటూ అగ్రహారం బ్రాహ్మణుల జీవితాలలోని విధ్వంసాన్ని కూడా రాయాల్సిన అవసరముంది. ఈ కథలలో శర్మగారు చాలా వరకు తన నేపథ్య జీవితాన్ని ఆవిష్కరించారన్నారు. ఆ తరువాత సీమకథకులు ఆచార్య మధురాంతకం నరేంద్ర కథలను విపులంగా పరిచయం చేస్తూ యుద్ధం, విప్లవం, నినాదాలు లేకుండా విప్లవ కథలు చదవాలంటే శర్మ గారి కథలే చదవాలి. మార్క్సిస్టు దృక్పధంతో రాసినా కథలలో చదివినంతసేపూ విధ్వంసం చదువరికి బోధపడుతుంది గానీ అది విప్లవ కథగా వెంటనే స్ఫురించకుండానే ఆలోచనలను చైతన్యవంతం చేయడంలో ఈ కథలు తమ పాత్రను పోషిస్తాయని చెప్పారు. నినాదాలు లేకుండా గొప్ప మార్క్సిస్టు కథలు రాసిన వారు శర్మగారని కొనియాడారు. నాన్నంటే కథ గొప్ప విప్లవకథగా పరిచయం చేసారు. గొప్ప కళాకారుడిగా కీర్తించారు. రెండు రెళ్ళు గురించి చెప్పి చివరిగా నాలుగు రావడాన్ని గోప్యంగా వుంచి అది పాఠకుడికి విడిచిపెట్టడంలో శర్మ సఫలీకృతులయ్యారనన్నారు. గుడిపాటి తనకు శర్మ గారితో వున్న పరిచయాన్ని చెప్తూనే కథాసంకలనాలను కొని సాహిత్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను తెలియజేసారు. చివరిగా శర్మ గారు తనకు పార్వతీపురంతో వున్న పరిచయాన్ని చెప్తూనే తనకు కథా రచన తన అమ్మనుండే అబ్బిందని, స్క్రీన్ ప్లే ఎలా రాయాలో తాను తన తల్లి దగ్గరే నేర్చుకున్నానని చెప్పారు. చివరిగా తన బాల్య మిత్రులు, సహాధ్యాయులు శర్మగారిని సన్మానించారు.

Friday, April 9, 2010

కవి రాం తండ్రి అస్తమించారు



'కొయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం' కవితా సంకలనం కవి సిహెచ్.రాం తండ్రి క్రిష్ణ్రారావు మాస్టారు గారు ఈ రోజు ఉ.11 గం.లకు యానాంలో అస్తమించారు. మాస్టారుకు కవి రాం అంటే చాలా ప్రేమ. కానీ చివరి క్షణాలలో రాం తన దరిలో లేకపోవడం విషాదం. తను మాకు దగ్గరలోని బొబ్బిలిలో నివాసముంటున్నాడు. తన సోదరుడు రవి తను కవలలు. ఇద్దరికీ సాహితీలోకంతో పరిచయం మెండు. ఏ కవితైనా చదివి యిట్టే గుర్తుపెట్టుకొని మరల సమయం వచ్చినప్పుడు దానిని మననం చేస్తూ వ్యాఖ్యానిస్తారు.

యిక్కడ రాం కవిత్వ పరిచయం సందర్బం కాకపోయినా తనతో పరిచయం లేనివారికి పరిచయం చేద్దామని...

కొయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం కవితా సంకలనం కవి శివారెడ్డి, కవి డా.శిఖామణి, కవి సీతారాం గార్ల ముందుమాటలతో మంచి విశ్లేషణతో వుంటుంది. దళిత కంఠాన్ని కొత్త గొంతుకతో మూలాలను స్పృశిస్తూ సాగుతుంది రాం కవిత్వం. అలాగని తన వర్గం వెతలనే కాక సమకాలీన సమస్యలన్నింటినీ తన నిశిత దృష్టితో పరిశీలించి కవిత్వీకరించి మనముందుంచుతాడు. మనం రోజువారీ అతి సాధారణంగా చూస్తూ పోయే వాటిని తన కవితలలో అభివ్యక్తీకరించిన తీరు రాంకే సాధ్యమా అనిపిస్తాయి.

కిటికీ...

తెల్లారక తెల్లారక తెల్లారుతుంది
ఎల్లవేసిన గోడలో పాతుకుపోయిన కిటికీ
కొత్తగా కనిపిస్తుంది
కిటికీ బుజాలమీద చేతులేసి
రాత్రంతా జాగారం చేసిన
కళ్ళు ఎరుపెక్కాయి
గాలి వచ్చీ, వానా వచ్చీ
మంచూ పట్టీ, పొగా పట్టీ
రాత్రి గడిచాక
ఓ వెలుగుకిరణాన్ని
కిచ కిచల పిట్టను చేసి
నాపైకి పంపుతుంది కిటికీ.

'నా బంగారు తల్లి పిడికెడు ఆత్మ
పిచ్చుకై వాలింది కిటికీరెక్కపైనే'

రెప్పల మధ్య ఓ పురా జ్నాపకం
కన్నీటి బిందువై నిలిచినపుడు
నా ముఖచిత్రం చుట్టూ
నలుచదరపు చట్రమై
నన్ను పొదివి పట్టుకుంది కిటికీయే...


2. పాకీ పిల్ల..
చీకటిని ప్రేమించే చీకటి పిల్ల
మనసుని చంపుకుని
మానవ మలాన్ని గంపలకెత్తుకుని
సందు సందునా సంచరించే
చండాల బాలిక...
---
ఆమె బాల్యాన్ని పలకరిస్తే భగవంతుడే భయపడతాడు
అసలు బాల్యాన్ని భగవంతుడితో పోల్చిందెవడు
బాల్యమే భగవంతుడైతే
భగవంతుడు ఏనాడో పీతి కుప్పమీద కూర్చున్నాడు..
--
రాత్రంతా
పాకీ పేటపై సంచరించిన
పీతి రంగు చంద్రుడు
తెల్లారేసరికి
వేదాల రేవులో తేలియాడుతున్నాడు
పదా...
చీపుర్ని పులిమి
కొత్త జీవనం సాగిద్దాం...

3. కొత్త వసంతం..
మా ఏకాంత పూదోటలో
పై పెదవి నేనై
క్రింది పెదవి తానై
ఈ ఫలాన్ని కోరుకున్నాం
వీడేమిటి
వామనుడై నన్ను
నా బాల్యపు లోతుల్లోకి తొక్కేస్తున్నాడు
--
ప్రతీ సాయంత్రం
వెన్నెల వాకిలిలో గెంతులేస్తూ
చంద్రవంకను మా యింటి చూరుకు
లాంతరు దీపమై వేలాడదీసి
నా బాల్యపు జ్నాపకాల కిటికీని
మూసేసిన మా అమ్మను
మరల, మరల జ్నాపకం చేస్తున్నాడు...

యిలా వైవిధ్యంతో సాగుతుంది రాం కవిత్వం. రాం కవిగా ఎదగడానికి తన తండ్రి ప్రోత్సాహం చాలా వుంది. మాస్టారు గారు అంబేద్కరిస్టుగా, బుద్ధిజాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా యానాం ప్రజలందరికీ తలలో నాలుకలా వున్న మనిషి. రాంకు తన చిన్నతనంలోనే అమ్మను కోల్పోయినా లోటు తెలియనివ్వని తండ్రీ. ఆయన మరణం రాం, రవిలకు కుటుంబ సభ్య్లకే కాదు యానాం వాసులందరికీ విషాదాన్ని నింపింది.

Thursday, April 8, 2010

ఇట్లు మీ విధేయుడు-భరాగో సెలవు



ఇట్లు మీ విధేయుడు కథా సంకలనంతో అందరి హృదయాలలో శాశ్వత స్థానం ఏర్పరచుకొని తన 78 వ ఏట అందరి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిన భరాగో లేరన్న వార్త తెలుగు సాహితీ లోకాన్ని శోక సంద్రంలో ముంచింది. తన సునిసిత హాస్య రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన భరాగో (భమిడిపాటి రామగోపాలం) గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు.

ఆయన వందకు పైగా కథలు, వంటొచ్చిన మగాడు, వెన్నెల నీడ నవలలు రాసారు. ఇట్లు మీ విధీయుడు కథా సంకలనంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఉన్నత మానవీయ సంబంధాలతో సాహితీ లోకాన ఆయన చేసిన కృషి మరువరానిది.

ఇక్కడ ఇట్లు మీ విధేయుడు చదవొచ్చుః
bhamidipati ramagopalam_Part1
Related Posts Plugin for WordPress, Blogger...